Breaking News

గులేల్‌తో షాపుల అద్దాలు ధ్వంసం చేసిన ముఠా అరెస్ట్.. 11 కేసులు ఛేదించిన ఐఎస్ సదన్ పోలీసులు

హైదరాబాద్‌లో ఖరీదైన షాపుల అద్దాలను గులేల్ మరియు గాజు గోలీలతో ధ్వంసం చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్న నలుగురు నిందితుల ముఠాను ఐఎస్ సదన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వినోదం, వికృతానందం కోసం ఈ దాడులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ముఠా అరెస్టుతో నగరంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మొత్తం 11 కేసులు ఛేదించబడ్డాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు రాత్రి వేళల్లో క్వాలిస్ వాహనంలో తిరుగుతూ ఖరీదైన దుకాణాలను లక్ష్యంగా చేసుకుని గులేల్‌తో గాజు గోలీలు విసిరి షాపుల అద్దాలను పగులగొట్టేవారు. ఈ చర్యల వల్ల ప్రజలకు ప్రాణహాని కలిగే అవకాశం ఉందని తెలిసినా వరుసగా నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి, నేరాలకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా పలు కేసుల్లో వీరి ప్రమేయం బయటపడింది.

అరెస్టైన నిందితులు బర్కాస్ ప్రాంతానికి చెందిన ఖాలీద్ బిన్ అలీ (44), రియల్ ఎస్టేట్ వ్యాపారి షేక్ మూసా బావజీర్ (29), యాకుత్‌పురాకు చెందిన ఏసీ టెక్నీషియన్ మొహమ్మద్ హిలాల్ మోహియుద్దీన్ (34), మటన్ షాపు కార్మికుడు మొహమ్మద్ ముద్దసిర్ ఖురేషీ (26)గా పోలీసులు తెలిపారు.

మొబైల్ స్నాచింగ్ నిందితులను 24 గంటల్లోనే పట్టుకున్న మహంకాళి పోలీసులు

వారి వద్ద నుంచి ఏపీ 29 బిసి 7004 నంబర్ గల క్వాలిస్ వాహనం, ఒక గులేల్, పది గాజు గోలీలు, రెండు మొబైల్ ఫోన్లు (Huawei Nova 12S, VIVO V56Y) స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా అరెస్టుతో సైదాబాద్, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, సరూర్‌నగర్, ఐఎస్ సదన్, చంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 11 కేసులు ఛేదించబడ్డాయి. కేసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 324(4), 324(5) కింద నమోదయ్యాయి.

చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే ఐపీఎస్ పర్యవేక్షణలో, సంతోష్ నగర్ ఏసీపీ టి. సుఖ్‌దేవ్ సింగ్, ఐఎస్ సదన్ ఇన్‌స్పెక్టర్ జి. నాగరాజు మార్గదర్శకత్వంలో ఎస్ఐ కె. మహేష్ మరియు సిబ్బంది ఈ కేసును ఛేదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *