సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ జైల్లో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ట్రాన్సిట్ హోంలో ఉన్న విదేశీయుల పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఎస్పీ మాట్లాడుతూ, పాస్పోర్ట్ గడువు ముగిసిన వారు మరియు ఇతర కారణాలతో ఇక్కడ ఉంచబడిన విదేశీయులను తమ దేశాలకు తిరిగి పంపించే వరకు ట్రాన్సిట్ హోంలో భద్రతతో ఉంచుతున్నామని తెలిపారు. ప్రస్తుతం 12 మంది విదేశీయులు అక్కడ ఉన్నారని చెప్పారు.
వారి భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్న ఎస్పీ, విదేశీయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. నిబంధనలకు అనుగుణంగా వారిని చూసుకోవాలని ట్రాన్సిట్ హోం సిబ్బందికి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జోగిపేట సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ పాండు, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
