మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరీష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ షీ టీం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మూడు వేర్వేరు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ హార్టికల్చర్ కాలేజ్ (మల్యాల), నర్సింగ్ హాస్టల్లలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, విద్యార్థినులకు లింగ సమానత్వం, మహిళా భద్రత, సమ్మతి (కన్సెంట్) యొక్క చట్టపరమైన ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సమాజంలో ప్రతి ఒక్కరిని గౌరవంగా చూడాలని, అనుమతి లేకుండా చేసే ఏ చర్య అయినా తప్పని తెలిపారు.
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని చెప్పారు.
లైంగిక వేధింపులు, స్ట్రీట్ హరాస్మెంట్, వెంటపడడం (స్టాకింగ్) వంటి ఘటనలపై వెంటనే షీ టీం నెంబర్ 8712656935కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. టీనేజ్ వయసులో ఎదురయ్యే భావోద్వేగ సమస్యలను ఎలా అధిగమించాలో కూడా వివరించారు.
అలాగే రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ వినియోగం, మద్యపానం, గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. డయల్ 100 ప్రాముఖ్యతను కూడా వివరించారు.
ఈ కార్యక్రమంలో షీ టీం ఏఎస్ఐ సుధాకర్, సిబ్బంది, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. సుమారు 500 మంది విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.
