జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ వారీగా పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్ల అమలు, సిబ్బంది పనితీరును సమగ్రంగా సమీక్షించారు.
ఇప్పటివరకు నమోదైన కేసులు, పెండింగ్లో ఉన్న పాత కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని సూచించారు.
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని అన్నారు. కోర్టులు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను తప్పించుకుని తిరుగుతున్న నిందితులపై పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
దొంగతనాల నివారణ, కేసుల ఛేదనలో ఆధునిక సాంకేతికతను వినియోగించి రికవరీ శాతం పెంచి బాధితులకు సొత్తు తిరిగి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, వ్యాపారస్తుల సహకారంతో మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పిల్లల రక్షణ, డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని అన్నారు. గంజాయి రవాణా చేసే వారితో పాటు వినియోగించే వారిపైనా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
