వరంగల్ జిల్లాలో తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా, IPS పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఖైదీల పునరావాసం, జైళ్ల ఆధునీకరణ, సంక్షేమ చర్యలకు సంబంధించిన పలు కార్యక్రమాలను ప్రారంభించి, జైళ్లలో సమగ్ర తనిఖీలు నిర్వహించారు.
మొదటగా నర్సంపేట మండలం ఖానాపూర్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 32వ “మై నేషన్” ఫిల్లింగ్ స్టేషన్ను డీజీ ప్రారంభించారు. విడుదలైన ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పించి, సమాజంలో తిరిగి గౌరవప్రదంగా స్థిరపడేలా చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాలు కేవలం వ్యాపార ప్రాజెక్టులు మాత్రమే కాకుండా, ఖైదీలకు కొత్త జీవితానికి మార్గదర్శకాలు అవుతాయని, వారికి విశ్వాసం, గౌరవం, రెండో అవకాశం కల్పిస్తాయని డా. సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ను ఆమె అభినందించారు.
తదుపరి, డీజీ నర్సంపేట మహిళా ప్రత్యేక జైలును సందర్శించి భద్రతా ఏర్పాట్లు, ఖైదీల సంక్షేమం, ఆహార నాణ్యత, వైద్య సేవలు, పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించారు. మహిళా ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. పునరావాసం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని వారికి సూచించారు.
ఆ తర్వాత మామ్నూర్ సెంట్రల్ జైలు వరంగల్ను సందర్శించిన డీజీ, నూతనంగా నిర్మించిన పరిపాలనా భవనాన్ని ప్రారంభించారు. ఈ భవనం ద్వారా జైలు పరిపాలన మరింత సమర్థవంతంగా నిర్వహించబడుతుందని ఆమె తెలిపారు. జైళ్లలో భద్రత, నిర్వహణ, ఆధునీకరణ, సంక్షేమ చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ పర్యటనతో తెలంగాణ జైళ్ల శాఖ భద్రతతో పాటు సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ జైళ్లను మార్పుకు కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతోందని స్పష్టమైంది.
ఈ కార్యక్రమాల్లో ఎం. సంపత్, డీఐజీ వరంగల్ రేంజ్, ఎస్. అంకిత్ కుమార్, డీసీపీ వరంగల్, టి. కళాసాగర్, సూపరింటెండెంట్ సెంట్రల్ జైలు వరంగల్ (మామ్నూర్), పి. వెంకటేశ్వర స్వామి, డీఎస్జేఓ వరంగల్, వై. శరత్, డివిజనల్ రిటైల్ సేల్స్ హెడ్ వరంగల్ తదితర అధికారులు మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
