సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఫిర్యాదుదారుల నుంచి నేరుగా సమస్యలను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ, సంబంధిత అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ వివిధ ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారించి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్హెచ్ఓలకు స్పష్టమైన సూచనలు చేశారు.
అలాగే, ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలు భయపడకుండా, మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ప్రజల సమస్యలను నేరుగా వినడం ద్వారా పోలీస్ శాఖపై నమ్మకం పెరుగుతుందని, త్వరితగతిన పరిష్కారాలు అందించడానికి ఇది ఉపయోగపడుతుందని ఎస్పీ పేర్కొన్నారు.
