మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అండర్ బ్రిడ్జి వద్ద మానవత్వాన్ని చాటిన ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు తీసుకెళ్తున్న ధాన్యం బస్తా ప్రమాదవశాత్తూ జారి రోడ్డుపై చెల్లాచెదురవగా, అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది వెంటనే స్పందించి రైతుకు సహాయం చేశారు.
ఈరోజు జరిగిన ఈ ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు భాస్కర్, పాపాలాల్, హోం గార్డ్ ఆఫీసర్ వెంకన్న పరిస్థితిని గమనించి తక్షణమే చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడిన ధాన్యాన్ని వృథా కాకుండా జాగ్రత్తగా ఏరి తిరిగి బస్తాల్లో నింపి రైతుకు అందజేశారు.
అంతేకాకుండా, రోడ్డుపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాలను నియంత్రిస్తూ, రాకపోకలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు. అనంతరం రోడ్డును శుభ్రపరచి సాధారణ పరిస్థితిని పునరుద్ధరించారు.
రైతు భూక్యా బాలాజీ ట్రాఫిక్ పోలీసుల సేవలను అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. సమయానికి స్పందించి నష్టాన్ని తప్పించారని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనతో ట్రాఫిక్ పోలీసులు కేవలం విధుల నిర్వహణలోనే కాకుండా, అవసర సమయంలో ప్రజలకు అండగా నిలుస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించారు. ప్రజలు కూడా రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ, సరుకు రవాణా సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.
