హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ పోలీసులు బస్సు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని బంగారం చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి సుమారు 17 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నార
కేసు వివరాల ప్రకారం, కొండాపూర్కు చెందిన డాక్టర్ డి.ఎస్. కీర్తన ఈ నెల 12వ తేదీ రాత్రి అనంతపురం నుండి హైదరాబాద్కు మీనా ట్రావెల్స్ బస్సులో ప్రయాణించారు. మరుసటి రోజు ఉదయం హైదరాబాద్ చేరుకున్న తరువాత తన బ్యాగ్ను పరిశీలించగా, అందులో ఉన్న సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు (లాంగ్ హారం, మంగళసూత్రం, గొలుసు, గాజులు, ఉంగరాలు) చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఆమె అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, క్రైమ్ నం. 153/2026, సెక్షన్ 303(2) BNS కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అరెస్టయిన నిందితుడు కర్నూలు జిల్లా బుధవారపేటకు చెందిన అన్నారెడ్డి వెంకట శివారెడ్డి (35). సూపర్ మార్కెట్లో సూపర్వైజర్గా పనిచేస్తున్న ఇతను జూదం మరియు విలాసాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో వారి బ్యాగులను తనిఖీ చేసి బంగారం దోచుకోవడం ఇతని నేర విధానం.
నిందితుడిపై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. అనంతపురం, కర్నూలు, విజయవాడ, కడప జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనం మరియు ఇతర నేరాలకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి.
గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్రమోహన్ పర్యవేక్షణలో, అఫ్జల్గంజ్ ఎస్హెచ్ఓ ఎన్. మోహన్ రావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బి. రవికిరణ్ మరియు క్రైమ్ టీమ్ సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించి, పక్కా సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి చోరీ చేసిన 17 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును విజయవంతంగా ఛేదించిన పోలీస్ అధికారులను ఉన్నతాధికారులు అభినందించి, రివార్డులను ప్రకటించారు.
