News Content:
సంగారెడ్డి జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు విజయవంతం కావడంలో సాంస్కృతిక సారధి కళాబృందం కీలక పాత్ర పోషించిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు. వారి సేవలను గుర్తిస్తూ కళాబృందం సభ్యులకు ప్రశంసాపత్రాలు మరియు మెమెంటోలను అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రోడ్డు భద్రత, ఆన్లైన్ మోసాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వంటి ముఖ్యమైన అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కళాబృందం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతను అప్రమత్తం చేయడంలో జిల్లా పోలీసు శాఖతో కలిసి మరింత సమన్వయంతో పని చేయాలని సూచించారు.
యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా, వారి భవిష్యత్తుపై దృష్టి సారించేలా స్కిట్లు, పాటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, సాంస్కృతిక సారధి కళాబృందం సభ్యులు సునిల్ కుమార్, రమేష్, ఎ.కే. బిక్షపతి, రవీందర్, సంధ్య, స్వప్న, శశిప్రియ, మల్లేష్, సాయిలు, దుర్గేష్, వినేశ్, ఆగమయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.








