హైదరాబాద్, ఏప్రిల్ 15, 2026: నగరంలో రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు మరియు చిన్నారుల ప్రాణాలను రక్షించేందుకు సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఖైరతాబాద్లోని వీవీ విగ్రహం వద్ద ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర సీపీ వీసీ సజ్జనార్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) డి. జోయెల్ డేవిస్ ఆదేశాల మేరకు ‘చిన్నారుల రహదారి భద్రతా దినోత్సవం’ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టబడింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖైరతాబాద్ జోన్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ చిన్నారులకు ఉచితంగా నాణ్యమైన హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 4 ఏళ్లు నిండిన ప్రతి చిన్నారి ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. తల్లిదండ్రులు తమ భద్రతతో పాటు పిల్లల భద్రతకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పిల్లల కోసం ప్రత్యేకంగా లభించే చిన్న సైజు హెల్మెట్లను కొనుగోలు చేసి, ప్రయాణంలో తప్పక ధరింపజేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి, ఎస్ఐలు ప్రసాద్, నోహిత, కరీం మరియు సిబ్బంది పాల్గొన్నారు. వారు స్వయంగా 10 మంది చిన్నారులకు హెల్మెట్లు తొడిగి, హెల్మెట్ స్ట్రాప్ను ఎలా సరిగ్గా పెట్టుకోవాలో తల్లిదండ్రులకు వివరించారు.
