
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి Arrive Alive-2026 ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు చేపట్టనున్న కార్యక్రమాలను జయప్రదం చేయాలి. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని, ప్రతి పౌరుడు బాధ్యతతో ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారానే ప్రమాదాలను తగ్గించవచ్చని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ తెలిపారు. Arrive Alive-2026 కార్యక్రమాన్ని భాగంగా చేసుకుని ఈ నెల 13 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు, ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అన్ని శాఖల సమన్వయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. ప్రతి సంవత్సరం నిర్లక్ష్య డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని నివారించేందుకు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, అప్రమత్తత వంటి అంశాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ సూచించారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ద్వారా మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించవచ్చని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడింగ్ వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
👉 Day-1 (13వ తేదీ, సోమవారం): జిల్లాలోని అన్ని గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలు, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం.
👉 Day-2 (14వ తేదీ, మంగళవారం): అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద రోడ్డు భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించడం. అలాగే బ్లాక్ స్పాట్స్ను గుర్తించి సంబంధిత శాఖలతో కలిసి మరమ్మత్తు చర్యలు చేపట్టడం.
👉 Day-3 (15వ తేదీ, బుధవారం): పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు, బస్సు డ్రైవర్లకు ప్రత్యేక సదస్సులు నిర్వహించడం.
👉 Day-4 (16వ తేదీ, గురువారం): ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, వారి లైసెన్సులు, యూనిఫామ్ తదితర అంశాలపై తనిఖీలు చేపట్టడం.
👉 Day-5 (17వ తేదీ, శుక్రవారం): ప్రమాద స్థలంలో ఇవ్వాల్సిన ప్రథమ చికిత్స, స్పందించే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించడం.
👉 Day-6 (18వ తేదీ, శనివారం): ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధించడం, వారికి అవగాహన కల్పించడం.
జిల్లా వ్యాప్తంగా ఆరు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాలకు ప్రజలు, యువత, వాహనదారులు సహకరించి విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్,ఐపీఎస్ కోరారు.
