
“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలను ఏప్రిల్ 13 నుండి 18 వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ తెలిపారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించనున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచ్, యువకులతో గ్రామ స్థాయి రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసి, ఆయా గ్రామాలలో ఉన్న రోడ్డు భద్రత సమస్యలను గుర్తించి, ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు డిఫెన్సివ్ డ్రైవింగ్ విధానాలను పాటించాలని, జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల దృశ్యాలను ఎల్ఇడి స్క్రీన్లు, ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు చూపిస్తూ అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో గోడలపై వాల్ పెయింటింగ్లు వేయిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని, పోలీసుకళా బృందాల ద్వారా చిన్న చిన్న నాటిక రూపంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచాలని అన్నారు. ముఖ్యంగా పోలీసులుగా మనమే ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని పోలీసు అధికారులు, సిబ్బందిపై కూడా ట్రాఫిక్ చలానాలు విధించాలని అధికారులకు ఆదేశించారు. వివిధ ఆటో, లారీ, బస్ డ్రైవర్ యూనియన్లతో సమావేశాలు నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలు మరియు తరచూ ఎదురవుతున్న సమస్యలపై చర్చించాలని సూచించారు. పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్, లౌడ్స్పీకర్లు, సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో జిల్లా ప్రజలు, విద్యార్థులు, డ్రైవర్లు, స్వచ్ఛంద సంస్థలు చురుకుగా పాల్గొని, రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

