
మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామంలో “మన గ్రామం – మన బాధ్యత” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పాల్గొని గ్రామస్తులతో మమేకమయ్యారు. రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం, సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామ భద్రత, అలాగే గంజాయి నిర్మూలనపై గ్రామస్తులకు సమగ్ర అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “మీ పిల్లలు ఎవరైనా గంజాయి సేవిస్తున్నారనే అనుమానం వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించండి. వారికి రిహాబిలిటేషన్ ద్వారా ఆ అలవాటును మాన్పించేందుకు మేము ప్రయత్నిస్తాము” అని తెలిపారు. గ్రామసభ ద్వారా గ్రామస్థులు తీసుకున్న ముఖ్య నిర్ణయాలను ఎస్పీ కొనియాడారు. గ్రామంలో 100% హెల్మెట్ వినియోగం అమలు చేయడం, గ్రామాన్ని గంజాయి రహిత గ్రామంగా మార్చడం, అలాగే గ్రామాన్ని సీసీటీవీ పర్యవేక్షణలో ఉంచడం వంటి నిర్ణయాలు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. “ఈ తీర్మానం గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది” అని అన్నారు. గ్రామస్తులు తీసుకున్న నిర్ణయాలను అభినందించిన ఎస్పీ “మీరు తీసుకున్న తీర్మానం చరిత్రలో నిలిచిపోతుంది. రామన్నగూడెం గ్రామం ఆదర్శ గ్రామంగా నిలుస్తుంది” అని అన్నారు. అనంతరం గ్రామస్తులకు హెల్మెట్లను పంపిణీ చేసి, రోడ్డు భద్రత పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

