రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గితే పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సిరిసిల్ల పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్న తీరును సమీక్షించారు. కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 16 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా, అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు 163 BNSS (సెక్షన్ 144) అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడకుండా చూడాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రం నుండి 200 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లు ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి నిబంధనలు కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
