జిల్లా పోలీస్ యంత్రాంగం మొబైల్ ఫోన్ల రికవరీలో అద్భుత ఫలితాలు సాధిస్తోంది. సుమారు రూ.6 లక్షల విలువ గల 63 మొబైల్ ఫోన్లను గుర్తించి సంబంధిత యజమానులకు అందజేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ రికవరీ మేళాలో, గత కొన్ని రోజులుగా పోయిన లేదా చోరీకి గురైన ఫోన్లను మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి సాంకేతిక ఆధారాలతో ట్రేస్ చేసి రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే చేతుల మీదుగా బాధితులకు ఫోన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారానికి కేంద్రంగా మారిందన్నారు. బ్యాంక్ ఖాతాలు, పాస్వర్డ్లు వంటి కీలక సమాచారం ఫోన్లలో భద్రపరుస్తున్న నేపథ్యంలో నేరగాళ్లు వీక్ పాస్వర్డ్లను బ్రేక్ చేసి ఫోన్పే, గూగుల్పే వంటి డిజిటల్ చెల్లింపు మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు.
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే Central Equipment Identity Register (CEIR) పోర్టల్ www.ceir.gov.in లో బ్లాక్ చేయాలని, అలాగే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా షాప్ యజమాని నుంచి రసీదు తీసుకోవాలని సూచించారు. దొంగిలించబడిన ఫోన్లను తక్కువ ధరకు అమ్ముతున్న సందర్భాల్లో అమాయకులు మోసపోతున్నారని, దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
CEIR అప్లికేషన్ ద్వారా మొబైల్ ఫోన్ల రికవరీలో కృషి చేసిన ఐటీ కోర్ ఎస్ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజాతిరుమలేష్లను ఎస్పీ అభినందించారు.
తమకు తిరిగి ఫోన్లు అందడంతో బాధితులు జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ ఎస్ఐ కిరణ్ కుమార్, ఆర్ఐ యాదగిరి, కానిస్టేబుల్ రాజాతిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.



