హైదరాబాద్: పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలను, ముఖ్యంగా చిన్నారులను అప్రమత్తం చేసే లక్ష్యంతో సైఫాబాద్ పోలీసులు నేడు రవీంద్ర భారతిలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్డీకాపూల్లోని కంగారా కిడ్స్ పాఠశాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
సైఫాబాద్ ఏసీపీ సంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఎస్హెచ్ఓ ఏ. సీతయ్య, ఎస్ఐ నవీన్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు, భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.
సదస్సును ఉద్దేశించి ఏసీపీ సంజయ్ మాట్లాడుతూ, రోజువారీగా చోటుచేసుకుంటున్న సైబర్ మోసాల గురించి విద్యార్థులకు స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ పరిమితి పెంపు పేరుతో జరిగే మోసాలు, ఫోన్ కాల్స్ ద్వారా వచ్చే మభ్యపెట్టే ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత ఓటీపీని ఎవరికీ పంచుకోవద్దని, అపరిచితుల కాల్స్ను నమ్మకూడదని తెలిపారు. బ్యాంకింగ్ సంబంధిత అవసరాలు ఉంటే నేరుగా సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించడం సురక్షితమని సూచించారు.
వినూత్నంగా నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం పట్ల పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
