సంగారెడ్డి: జిల్లాలోని పారిశ్రామిక వాడలలో పనిచేస్తున్న మహిళల సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్.ఎస్.ఎస్.సి) మరియు న్యూల్యాండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “షీ-షట్లర్” బస్సును జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా పాశమైలారం పరిశ్రమల్లో విధులు నిర్వహిస్తున్న మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. జిల్లాలో ప్రజలు, పరిశ్రమల భద్రత, ట్రాఫిక్ సమస్యల నియంత్రణతో పాటు మహిళలపై జరిగే నేరాలను అరికట్టే లక్ష్యంతో సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలీసు శాఖ–కంపెనీల అనుసంధానంతో ఈ సంస్థ పనిచేస్తోందన్నారు.

ఇస్నాపూర్ నుంచి ఇంద్రకరణ్ వరకు ఈ బస్సు రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నడుస్తుందని, ఆ మార్గంలో ప్రయాణించే మహిళలు మరియు పాఠశాల విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. బస్సు జీపీఎస్కు అనుసంధానమై ఉండటంతో ప్రస్తుత స్థానం, సమయ వివరాలు సులభంగా తెలుసుకునే వీలుందని తెలిపారు.
మహిళలు తప్పనిసరిగా “టి-సేఫ్” యాప్ను డౌన్లోడ్ చేసుకుని తమ ప్రయాణ వివరాలను అందులో నమోదు చేయాలని సూచించారు. ఆపద సమయంలో డైల్ 100కు కాల్ చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.ఎస్.సి జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, ట్రెజరర్ రమణారెడ్డి, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ఐలా పాశమైలారం కమిటీ ప్రతినిధులు, న్యూల్యాండ్ కంపెనీ సెక్రటరీ శారద, హెచ్ఆర్ ప్రతినిధులు, సి.ఎస్.ఆర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

