హైదరాబాద్: సామాన్య ప్రజలను సైబర్ నేరాల పట్ల అప్రమత్తం చేసే లక్ష్యంతో సికింద్రాబాద్ జోన్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామియా ఉస్మానియా సమీపంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో భారీ సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ జోన్ డిసిపి రక్షిత కృష్ణ మూర్తి, హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిలకలగూడ ఏసీపీ కె. శశాంక్ రెడ్డి, వారసిగూడ ఇన్స్పెక్టర్ రవీందర్ గౌడ్, సెక్టర్ ఎస్సై రామచంద్రారెడ్డి, సికింద్రాబాద్ జోన్ మహిళా ఎస్సై మేఘనతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిసిపి రక్షిత కృష్ణ మూర్తి మాట్లాడుతూ, ప్రస్తుతం మొబైల్ గేమింగ్ మరియు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ గేమ్స్ ఆడుతున్న సమయంలో ‘ఫ్రీ గిఫ్ట్’ వంటి ఆకర్షణీయ ఆఫర్లు కనిపించినప్పుడు ఆలోచించకుండా క్లిక్ చేయకూడదని తెలిపారు. ఇలాంటి లింకులు ప్రమాదకర వెబ్సైట్లకు తీసుకెళ్లి అనధికారిక యాప్లను డౌన్లోడ్ చేయించే అవకాశముందని హెచ్చరించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత ఓటీపీని ఎవరికీ పంచుకోవద్దని, క్రెడిట్ కార్డ్ పరిమితి పెంపు వంటి ఆఫర్ల పేరుతో వచ్చే కాల్స్, మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సందేహాలు ఉంటే నేరుగా బ్యాంక్ శాఖను సంప్రదించడం సురక్షితమని తెలిపారు.
అనధికారిక యాప్లను డౌన్లోడ్ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం దొంగిలించబడే ప్రమాదం ఉందని, సైబర్ భద్రత పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని డిసిపి పిలుపునిచ్చారు.
