హైదరాబాద్, జూన్ 2: మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ సిటీ పోలీసులు మరో కీలక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల కాలంలో డ్రగ్స్ అలవాటుకు గురైన 100 మంది వినియోగదారులు, పెడ్లర్లకు కమిషనర్స్ టాస్క్ఫోర్స్ (శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లు) ఆధ్వర్యంలో ప్రత్యేక యాంటీ-డ్రగ్ కౌన్సిలింగ్ మరియు పునరావాస సదస్సును నిర్వహించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల వ్యాప్తిని పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వ్యసనాలకు బానిసలైన వ్యక్తులు ఆ అలవాట్లను విడిచిపెట్టి, తిరిగి సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి అవసరమైన అవగాహన, ప్రేరణ కల్పించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
మానసిక ఆరోగ్యంపై అవగాహన
సదస్సులో ప్రముఖ సైకాలజిస్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లైఫ్ కోచ్ డాక్టర్ చిన్మయి తమ్మారెడ్డి పాల్గొని మాదకద్రవ్యాల వ్యసనాల నుంచి బయటపడే మార్గాలు, మానసిక ఆరోగ్య ప్రాధాన్యత, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునే అంశాలపై వివరించారు.
చట్టపరమైన పరిణామాలపై హెచ్చరిక
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) నార్కోటిక్స్ స్పెషలిస్ట్ ఎ. రంగధామ్ మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు, సామాజిక ప్రభావాలు, ఆరోగ్యపరమైన దుష్పరిణామాల గురించి సమగ్రంగా వివరించి అవగాహన కల్పించారు.
అధికారుల సమన్వయంతో విజయవంతం
శంషాబాద్, రాజేంద్రనగర్ టాస్క్ఫోర్స్ అధికారుల సమన్వయంతో ఇన్స్పెక్టర్లు కె. వెంకట్ రెడ్డి, కె. రవి మరియు వారి బృందాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ప్రజల సహకారం కోరిన పోలీసులు
హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ పోలీసు శాఖకు పూర్తి స్థాయిలో సహకరించాలని హైదరాబాద్ సిటీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
