ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించి వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజావాణి” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు.
ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా ఫిర్యాదుదారులను కలిసి వారి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల వినతులను స్వీకరించి, సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు నేరుగా ఫోన్ చేసి కేసుల పురోగతిపై ఆరా తీశారు.
చట్ట పరిధిలో ఉన్న ప్రతి సమస్యను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పోలీస్ శాఖ పని చేయాలని సూచించారు.
సమాజంలో వృద్ధుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ పేర్కొన్నారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేసినా, మానసికంగా లేదా శారీరకంగా వేధించినా అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇలాంటి అంశాలపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి అర్జీని కంప్యూటరైజ్ చేసి, సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పర్యవేక్షించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
