హైదరాబాద్: అంబర్పేట్ పోలీస్ స్టేషన్ మరియు కిమ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గోల్నాక లంకలోని తులసీరామ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 09:30 గంటలకు ప్రారంభమైన ఈ శిబిరానికి స్థానిక ప్రజలు సుమారు 200 మంది హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ వైద్య శిబిరాన్ని సికిందరాబాద్ జోన్ డిసిపి రక్షిత కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కిమ్స్ ఫౌండేషన్కు చెందిన నిపుణులైన వైద్యులు జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ మరియు ఫిజియోథెరపీ విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తంలో చక్కెర శాతం, రక్తపోటు, హిమోగ్లోబిన్ పరీక్షలను ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి మందులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి జె. నర్సయ్య, ఓయూ డివిజన్ ఏసీపీ జి. జగన్, అంబర్పేట్ ఇన్స్పెక్టర్ టి. కిరణ్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
