మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎండాకాలంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఆధ్వర్యంలో నెహ్రూ సెంటర్ ట్రాఫిక్ పోస్ట్ వద్ద వాటర్ మిస్ట్ స్ప్రింక్లర్స్ ఆధారిత కూలింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సిస్టమ్ ద్వారా నీటి మిస్ట్ రూపంలో చల్లదనం కలిగి, మండుతున్న ఎండల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి తక్షణ ఉపశమనం లభించనుంది.
అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బందికి మిల్టన్ వాటర్ ఫ్లాస్క్స్ మరియు కూలింగ్ గాగుల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం తీవ్ర ఎండల్లోనూ అంకితభావంతో పనిచేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యం కాపాడటం పోలీస్ శాఖ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. వేసవి కాలంలో హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి సమస్యలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ సిబ్బందిలో ఉత్సాహం పెరగడంతో పాటు విధుల పట్ల మరింత నిబద్ధత పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
