చంచల్గూడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (సికా)లో ఢిల్లీ జైళ్ల సిబ్బందికి నిర్వహిస్తున్న ప్రాథమిక ప్రవేశ శిక్షణ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు డా. సౌమ్య మిశ్రా, డైరెక్టర్ జనరల్ జైళ్లు & సంస్కరణ సేవలు తెలంగాణతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రాల మధ్య సమన్వయం, పరస్పర సహకారానికి నిదర్శనంగా ఈ శిక్షణ కార్యక్రమం నిలుస్తోంది. 2026 సంవత్సరంలో మొత్తం 381 మంది ఢిల్లీ జైళ్ల సిబ్బంది దశలవారీగా శిక్షణకు ఎంపిక కాగా, తొలి విడతలో 62 మంది శిక్షణార్థులు పాల్గొంటున్నారు. వీరిలో 61 మంది ఢిల్లీ జైళ్ల శాఖకు చెందినవారు కాగా, ఒకరు తెలంగాణ జైళ్ల శాఖ వార్డర్గా ఉన్నారు.
తొమ్మిది నెలలపాటు కొనసాగే ఈ సమగ్ర శిక్షణ కార్యక్రమంలో జైలు నియమాలు, క్రిమినాలజీ, మానవ హక్కులు, క్రిమినల్ చట్టాలు, జైలు పరిపాలనలో సాంకేతికత వంటి సిద్ధాంత పాఠాలతో పాటు శారీరక వ్యాయామం, పరేడ్, యోగా, ధ్యానం వంటి అంశాలు కూడా బోధించనున్నారు.
శిక్షణార్థులు సికాలోని ఆధునిక తరగతి గదులు, ఎయిర్ కండిషన్ ఆడిటోరియం, గ్రంథాలయం, హాస్టల్ సదుపాయాలు, జిమ్, శిక్షణ మైదానాలు వంటి సౌకర్యాలను వినియోగించుకోనున్నారు.
ఈ సందర్భంగా డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ జైళ్ల శాఖ సమాజానికి ఎంతో ముఖ్యమని, జైలు సేవ అనేది కేవలం భద్రతా బాధ్యత మాత్రమే కాకుండా ఖైదీలను సరిదిద్దుతూ సమాజంలో తిరిగి కలపాల్సిన బాధ్యత అని పేర్కొన్నారు. శిక్షణార్థులు క్రమశిక్షణ, నిష్పక్షపాతిత్వం, వృత్తిపరమైన నైపుణ్యాలతో పనిచేయాలని సూచించారు.
డా. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ అంతర్రాష్ట్ర సహకారం ద్వారా సంస్కరణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. సికాపై ఢిల్లీ జైళ్ల శాఖ ఉంచిన విశ్వాసం గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జైళ్ల శాఖ అధికారులు, సిబ్బంది కలిసి డీజీపీ బి. శివధర్ రెడ్డి గారి 60వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమం వోటు ఆఫ్ థాంక్స్తో ముగిసింది.
