జిల్లాలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే దిశగా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మీడియా సభ్యులకు హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తమ ప్రాణ భద్రత కోసం హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయాలు మరియు ప్రాణ నష్టం తగ్గించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. సమాజంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడంలో మీడియా మిత్రులు ముందుండాలని పిలుపునిచ్చారు.
హెల్మెట్ వినియోగంపై ప్రజలకు సరైన సమాచారం చేరవేసి, ప్రతి ఒక్కరికి హెల్మెట్ ధరించే అలవాటు ఏర్పడేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అవసరమని ఎస్పీ తెలిపారు.
అనంతరం శాంతలక్ష్మి ఫౌండేషన్ ప్రతినిధులు కంబాలపల్లి ఉపేందర్, మన్నెం యాదగిరి సహకారంతో రోడ్డు భద్రతను ప్రోత్సహించే భాగంగా జిల్లా ఎస్పీ చేతుల మీదుగా మీడియా సభ్యులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో హెల్మెట్ వినియోగంపై మరింత చైతన్యం పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బీ సీఐ రాము, వన్టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, ఉమెన్ పోలీస్ స్టేషన్ సీఐ కరుణాకర్ తదితర పోలీస్ అధికారులు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
