
నల్గొండ జిల్లా పరిధిలో జాతీయ రహదారులు మరియు ఇతర హైవేలపై రాత్రి సమయంలో ఆగి ఉన్న లారీలు, ట్రక్కులు మరియు ఇతర భారీ వాహనాల నుండి వరుసగా డీజిల్ దొంగతనాలు జరుగుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఘటనలపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీజిల్ దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి మరియు చిట్యాల సిఐ నాగరాజు పర్యవేక్షణలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, హైవేలు మరియు అనుమానాస్పద ప్రాంతాల్లో గస్తీ పెంచడం జరిగింది. ఈ క్రమంలో తేదీ 10-04-2026 నాడు రాత్రి సమయంలో చిట్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేపై అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన ఒక DCM వాహనాన్ని గమనించారు. అందులోని వాహనాన్ని తనిఖీ చేయగా, వడ్లపట్టాల చాటున డీజిల్ తో నిండిన క్యాన్లు దాచిపెట్టినట్లు గుర్తించారు. మొత్తం సుమారు 400 లీటర్ల డీజిల్ అక్కడ లభించింది. అందులో ఉన్న డ్రైవర్ బాలకృష్ణ మరియు ఇతరులను అదుపులోకి తీసుకొని విచారణ జరపగా హైవేపై ఆగి ఉన్న గుర్తు తెలియని లారీల నుండి డీజిల్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. అలాగే, తమ ముఠాకు చెందిన మరికొంత మంది సభ్యులు మరో DCM వాహనంతో కొంత దూరంలో ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. దీనిపై వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టి రెండవ DCM వాహనాన్ని కూడా గుర్తించి, దానిలో మిగతా డీజిల్ మరియు మొత్తం 6 గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. 1).ముడావత్ గాంధీ నాయక్, 2).ముడావత్ వెంకటేశ్వర్లు నాయక్, 3).బనావత్ తుల్స్య నాయక్, 4).ముడావత్ బాలకృష్ణ నాయక్, 5).రామవత్ వాగ్య నాయక్, 6). (మైనర్ బాలుడు ) పైన నిందితులందరూ పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. నిందితులు ముందుగా హైవేలపై రాత్రి సమయంలో ఆగి ఉన్న లారీలు మరియు ఇతర వాహనాలను లక్ష్యంగా ఎంచుకుంటారు. వాహనాల డ్రైవర్లు నిద్రలో ఉన్న సమయంలో, వాహనంలోని డీజిల్ ట్యాంకులను తెరిచి డీజిల్ను దొంగిలిస్తారు. దొంగిలించిన డీజిల్ను తమ వాహనాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాంకుల్లో నింపుకుంటారు. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుండి త్వరగా వెళ్లిపోతారు. ఈ విధంగా వీరు చెడు వ్యాసనాలకు అలవాటు పడి సులువుగా సంపాదించాలనే ఉద్దేశ్యం తో ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతునట్లు, గతంలో కూడా పలు జిల్లాల్లో డీజిల్ దొంగతనాలకు పాల్పడి 20 కేసులకు పైగా నమోదైనట్లు విచారణలో వెల్లడైంది. ఈ సందర్బంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ హైవేలపై ప్రయాణించే ప్రజలు మరియు వాహనదారులు, అనుమానాస్పద వ్యక్తులు లేదా డీజిల్ దొంగతనాలు గమనించిన వెంటనే Dial-100 ద్వారా పోలీసులను సంప్రదించాలని కోరుతున్నారు. చాలా సందర్భాలలో బాధితులు వెంటనే ఫిర్యాదు చేయకపోవడం వల్ల నేరస్తులు తప్పించుకునే అవకాశాలు పెరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులోని ముఠా సభ్యులను నల్గొండ డి.ఎస్.పి. కె.శివరాం రెడ్డి పర్యవేక్షంలో పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన, నల్గొండ సి.సి.ఎస్ ఇన్స్పెక్టర్ లు ఎమ్.జితేంధర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చిట్యాల సిఐ నాగరాజు, చిట్యాల ఎస్.ఐ రవి కుమార్,సిసిఎస్ ఎస్ఐలు విజయ్ కుమార్, మధు, సతీష్ వర్మ మరియు సి.సి.ఎస్ హెడ్ కానిస్టేబుల్స్ విష్ణువర్ధన గిరి, పుష్పగిరి, వహీద్ పాషా, శ్రీను, కానిస్టేబుల్స్, అస్రర్ దస్తాగిరి , సాయికుమార్, జూనేద్ , శివరాజు, నరేశ్ మరియు ఇతర సిసిఎస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు.

