
సంగారెడ్డి జిల్లా పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో పోలీసు అధికారుల నుండి హోంగార్డుల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉండే పోలీసులకు ఈ విధమైన క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయని అన్నారు. ఈ టోర్నమెంట్లో వందకు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని పేర్కొంటూ, అందరూ క్రీడా స్ఫూర్తితో పోటీపడి మంచి ప్రతిభ కనబరచాలని సూచించారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లకు ఎంపిక చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. పాల్గొన్న ప్రతి క్రీడాకారునికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం తో పాటు విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.

