సమయస్ఫూర్తితో స్పందించిన గంగరాజు, అనిల్లను ఎస్పీ మహేష్ బి. గితే సత్కారం
రాజన్న సిరిసిల్ల: విధి నిర్వహణలో అప్రమత్తతతో అమూల్యమైన ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించి ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.
ఇటీవల వేములవాడ తిప్పపూర్ బస్టాండ్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ (CPR) నిర్వహించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ గంగరాజును ప్రత్యేకంగా ప్రశంసించారు. సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణరక్షణ చేయడం పోలీస్ సేవాభావానికి నిదర్శనమని ఎస్పీ పేర్కొన్నారు.
అలాగే తంగళ్ళపల్లి వద్ద మానేరు వాగులో దూకి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని ధైర్యసాహసాలతో రక్షించిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్లను కూడా అభినందించారు. ప్రాణాపాయం లెక్కచేయకుండా స్పందించి ప్రాణాలు కాపాడినందుకు వారిని సత్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల ప్రాణరక్షణే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని, ఇదే సేవాభావంతో ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని సూచించారు. సమాజంలో పోలీసులపై విశ్వాసం పెంపొందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు.
