హైదరాబాద్, వనస్థలిపురం: వనస్థలిపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విడాకులు ఇచ్చిందన్న కోపంతో ఓ మహిళను ఆమె మాజీ భర్త కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న సునీత అనే మహిళ ఇంట్లోకి ఆమె మొదటి భర్త మహేష్ చొరబడి దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మహేష్ రెండు కత్తులు మరియు పెట్రోల్ డబ్బాతో ఇంట్లోకి వచ్చి సునీతపై దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు సమాచారం.
ఈ ఘటన సమయంలో ఇంట్లో ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే పెట్రోల్ పోసి తగలబెడతానని మహేష్ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మహేష్ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రాథమిక విచారణలో మహేష్, “సునీతతో గతంలో వివాహం జరిగింది. ఆమె నాపై కేసులు పెట్టి విదేశాలకు వెళ్లకుండా చేసింది. అందుకే కోపంతో ఆమెను హత్య చేశాను” అని పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
విడాకుల అనంతరం సునీత శ్రీనాథ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుని ప్రస్తుతం మూడు నెలల గర్భవతిగా ఉన్నట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
