బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
రూ.50 వేల జరిమానా విధించిన పోక్సో ప్రత్యేక కోర్టు
మారిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బాలికపై అత్యాచారం, హత్యకు సంబంధించిన దారుణ ఘటనలో నిందితుడికి మహబూబాబాద్ జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తూ కఠిన తీర్పు వెలువరించింది.
2021 సంవత్సరంలో బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారిపెడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. భారతీయ దండన చట్టం సెక్షన్లు 376(2)(n), 302 మరియు పోక్సో చట్టం-2012 సెక్షన్ 3 r/w 4 కింద కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో నిందితుడైన ధర్మసోత్ రాజేష్ (22), అనే వ్యక్తిని కోర్టు దోషిగా నిర్ధారించింది. న్యాయమూర్తి ఎండీ . అబ్దుల్ రఫీ, సెక్షన్ 235(2) ప్రకారం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధించారు.
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా పోలీస్ అధికారులు ఎంతో శ్రమించి, ప్రతి ఆధారాన్ని శాస్త్రీయంగా సేకరించి, సాక్ష్యాలను పకడ్బందీగా సమర్పించారు. అప్పుడు దర్యాప్తు అధికారిగా పనిచేసిన సాగర్, సీఐ మారిపెడ ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించి, సాక్ష్యాలను బలంగా రూపొందించారు. కోర్టు లైజన్ అధికారిగా ఎన్ . జీనత్ (ఎస్.ఐ –డీసీఆర్బి ) కోర్టు ప్రక్రియలో సమన్వయం నిర్వహించారు. బ్రీఫింగ్ అధికారిగా ఎస్ . రాజ్కుమార్ గౌడ్, సీఐ – మారిపెడ సమగ్ర మార్గదర్శకత్వం అందించారు. కేసు డాక్యుమెంటేషన్ బాధ్యతలను సి.హెచ్ శ్రీనివాస్ (హెడ్ కానిస్టేబుల్–1777) సమర్థంగా నిర్వహించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య బలమైన వాదనలు వినిపించడం ద్వారా కేసు విజయవంతంగా ముగియడానికి కీలక పాత్ర పోషించారు.
పోలీస్ బృందం నిరంతర కృషి, సమన్వయం, పట్టుదల ఫలితంగానే నిందితుడికి కఠిన శిక్ష పడిందని అధికారులు తెలిపారు. బాలలపై జరిగే ఘోర నేరాలకు చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసి ప్రజలలో నమ్మకం పెంచింది.
