హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమాజిగూడలోని జీఆర్టీ జంక్షన్, ప్రజా భవన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాటర్లాగింగ్ పాయింట్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ గురువారం రాత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్తో పాటు జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, డీసీపీ అవినాష్ కుమార్ మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పరిశీలన అనంతరం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులతో సమన్వయం చేసుకుంటూ రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని వేగంగా తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే, వర్షం తగ్గి రోడ్లపై నీటి నిల్వలు పూర్తిగా తొలగిపోయే వరకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండి ప్రయాణికులకు సహాయపడాలని ఆదేశించారు.
పౌరులు అవసరమైతే ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని అధికారులు సూచించారు.
