వికారాబాద్, ఆగస్టు 3: వికారాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా వివిధ సమస్యలతో వచ్చిన బాధితులను ఎస్పీ స్వయంగా కలిసి వారి వినతులను శ్రద్ధగా ఆలకించారు. అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత పోలీసు అధికారులతో వివరాలు తెలుసుకుని, చట్టపరమైన నిబంధనల మేరకు నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి, చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్భయంగా పోలీసు శాఖను ఆశ్రయించాలని, జిల్లా పోలీసు అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తారని స్పష్టం చేశారు.
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు.
