హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, ఆగస్టు 4: బండ్లగూడ పోలీస్ స్టేషన్ (గతంలో చాంద్రాయణగుట్ట) పరిధిలో 2023లో జరిగిన హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ నాంపల్లిలోని 4వ అదనపు సెషన్స్ కోర్టు సోమవారం (03-08-2026) తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.
పోలీసుల వివరాల ప్రకారం, 2023 జనవరి 18న రాత్రి 10:40 గంటల సమయంలో ముంతాజ్ బాగ్లోని విద్యుత్ కార్యాలయం సమీపంలో ఓ వ్యక్తిపై బండరాయితో దాడి జరిగినట్లు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది సహాయంతో పరిశీలించగా బాధితుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం బండ్లగూడ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నం. 52/2023గా ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో నిందితుడు వేముల రాజు (38), కూలీ, జల్పల్లి, బాలాపూర్ నివాసిగా గుర్తించారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ఈ కేసులో ఎస్సై జి. ఆంజనేయులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఇన్స్పెక్టర్ ఎ. మధుసూదన్ రెడ్డి తొలి దర్యాప్తు నిర్వహించారు. అనంతరం ఇన్స్పెక్టర్ కె.ఎన్. ప్రసాద్ వర్మ ఛార్జిషీట్ దాఖలు చేశారు. న్యాయస్థానంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. శ్రీవాణి ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించగా, లీగల్ కౌన్సెలర్ సురేష్ కుమార్ శర్మ సహకరించారు.
కేసులో కీలక సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించడంలో కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఎ. ఆంజనేయులు (పీసీ-6808), సమన్స్/వారెంట్ల అమలులో ఛత్రీ శశిధర్ (పీసీ-3758)తో పాటు దర్యాప్తు బృందం చేసిన కృషిని ఉన్నతాధికారులు మరియు బండ్లగూడ ఇన్స్పెక్టర్ ఆర్. దేవేందర్ అభినందించారు.
