వికారాబాద్, ఆగస్టు 3: పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, ముఖ్యంగా స్టేషన్ రైటర్ల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచడం, దర్యాప్తు ప్రమాణాలను పెంపొందించడం, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం సాధించడం, చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించడం లక్ష్యంగా వారంరోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డా. శబరీష్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు.
ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం 2018, 2020, 2024 బ్యాచ్లకు చెందిన పోలీసు సిబ్బందికి నిర్వహించబడుతోంది. అనుభవజ్ఞులైన పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణలో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐల పర్యవేక్షణలో ఇద్దరు ఏఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ట్రైనర్లుగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ స్టేషన్ విధులు, దర్యాప్తు విధానాలు, రికార్డుల నిర్వహణ, చట్టాల అమలు, ఎఫ్ఐఆర్ నమోదు, కేసు డాక్యుమెంటేషన్, కోర్టు సంబంధిత ప్రక్రియలు, ప్రాక్టికల్ అంశాలపై సమగ్ర శిక్షణ అందించనున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరగాలంటే ప్రతి కేసు చట్టబద్ధంగా, పారదర్శకంగా, నాణ్యతతో దర్యాప్తు జరగాలని అన్నారు. ప్రతి పోలీసు సిబ్బంది భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS), భారతీయ సాక్ష్య అధినియమం (BSA)తో పాటు ఇతర సంబంధిత చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
పోలీస్ స్టేషన్లో నమోదయ్యే ప్రతి ఫిర్యాదును నిబంధనల ప్రకారం స్వీకరించి, ఎఫ్ఐఆర్ నమోదు, కేసు డైరీ నిర్వహణ, దర్యాప్తు నివేదికల తయారీ, కేసు ఫైళ్ల నిర్వహణ, సాక్ష్యాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాల నమోదు, చార్జ్షీట్లు సిద్ధం చేయడం, కోర్టు సంబంధిత పత్రాలను సక్రమంగా రూపొందించడం వంటి అంశాలపై ఈ శిక్షణలో సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
స్టేషన్ రైటర్ల బాధ్యతల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, పోలీస్ స్టేషన్ పరిపాలనలో వారి పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. జనరల్ డైరీ, ఎఫ్ఐఆర్ రిజిస్టర్లు, కేసు ఫైళ్లు, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, బెయిల్ పత్రాలు, సమన్లు, వారెంట్లు, కోర్టు రికార్డులు, వివిధ రిజిస్టర్ల నిర్వహణ వంటి అన్ని అధికారిక పత్రాలను చట్టబద్ధంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాల్సిన బాధ్యత స్టేషన్ రైటర్లపై ఉంటుందని తెలిపారు.
రికార్డుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి పత్రాన్ని నిర్దేశిత సమయంలో సిద్ధం చేయాలని, చట్టాల్లో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి సంబంధిత అధికారులకు అందజేయాలని, పారదర్శకత, జవాబుదారీతనం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని అన్నారు.
ప్రతి పోలీసు సిబ్బంది తమ విధులను కేవలం బాధ్యతగా కాకుండా ప్రజాసేవగా భావించాలని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను రోజువారీ విధుల్లో అమలు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక శిక్షణ ద్వారా పోలీసు సిబ్బందిలో వృత్తి నైపుణ్యాలు, దర్యాప్తు సామర్థ్యం, రికార్డుల నిర్వహణలో నాణ్యత మరింత మెరుగుపడి, ప్రజలకు అందించే సేవల ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు.
