సంగారెడ్డి, ఆగస్టు 3: జిల్లా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించారు. అనంతరం సంబంధిత ఎస్హెచ్ఓలతో ఫోన్లో మాట్లాడి సమస్యలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అందిన ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్లలో తమ సమస్యలకు పరిష్కారం లభించని పక్షంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై జిల్లా పోలీసు కార్యాలయం ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తుందని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా న్యాయం అందించడమే సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పేర్కొన్నారు.
