హైదరాబాద్లో ఆహార కల్తీపై అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. హెచ్-ఫాస్ట్ (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి చార్మినార్ పరిధిలోని హుస్సేనీఆలం ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఫాస్ట్ ఫుడ్ గోదాముపై ఆకస్మిక దాడి నిర్వహించింది.
పంచ్ మొహల్లా, న్యూ లాడ్ బజార్లో ఉన్న ‘అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’లో తనిఖీలు చేపట్టగా, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండానే ఆహార తయారీ, నిల్వ జరుగుతున్నట్లు గుర్తించారు. నిషేధిత ఆహార రంగుల వినియోగం, పదేపదే వాడిన వంట నూనె, అపరిశుభ్ర వాతావరణం, కీటకాల నియంత్రణ లేకపోవడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడ్డాయి.
దాడిలో సుమారు 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల వంట నూనె, కృత్రిమ రసాయన ఆహార రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఇలాంటి కల్తీ ఆహారం వల్ల ఫుడ్ పాయిజనింగ్, జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అనుమానాస్పద ఆహార పదార్థాలపై ఫిర్యాదుల కోసం 8712661212 టోల్-ఫ్రీ నంబర్ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
