వికారాబాద్, ఆగస్టు 3: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల నుంచి వచ్చిన 58 మంది బాధితులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్కు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రతి బాధితుడి ఫిర్యాదును జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి, వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, చట్టపరంగా, నిష్పాక్షికంగా విచారణ నిర్వహించి, త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసం, ఆర్థిక లావాదేవీలు, ఇతర వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించిన జిల్లా ఎస్పీ, ప్రతి ఫిర్యాదుపై పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డేను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.
ప్రజా సమస్యలకు త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కారం అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు.
