ఇల్లంతకుంట, జూన్ 18: ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ ఎల్లమ్మ జాతర మహోత్సవంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం జాతరకు హాజరైన భక్తులతో ఎస్పీ ఆత్మీయంగా ముచ్చటించి వారి సంక్షేమాన్ని ఆకాంక్షించారు. మహోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
జాతరను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు చేపట్టిందని ఎస్పీ తెలిపారు. భక్తులు పోలీసు అధికారుల సూచనలను పాటిస్తూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ అశోక్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
