వికారాబాద్, జూన్ 18: వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా పరిగి డివిజన్ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పరిగి మండలం మల్లేమోనిగూడ గ్రామంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో తెల్లవారుజామున 5 గంటల నుంచి భారీ ‘కమ్యూనిటీ కాంటాక్ట్’ (కార్డన్ అండ్ సెర్చ్) ఆపరేషన్ చేపట్టారు.
దాదాపు 160 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో గ్రామంలోని ప్రతి ఇల్లు, అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకోగా, 39 లీటర్ల అక్రమ మద్యాన్ని కూడా పట్టుకున్నారు.
అదే విధంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 31 చలాన్లు నమోదు చేసి రూ.12,245 జరిమానా విధించారు. అనుమానాస్పద వ్యక్తులను పాప్ లాన్ డివైస్ ద్వారా తనిఖీ చేశారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.
తనిఖీల అనంతరం గ్రామ ప్రజలతో సమావేశమైన పోలీసు అధికారులు సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యత, సైబర్ నేరాలు, డ్రగ్స్ ప్రమాదం, బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో చట్టం, మహిళల భద్రత, ఆస్తుల రక్షణ మరియు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పరిగి సీఐ కొండల్ రెడ్డి, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి, పరిగి సబ్ డివిజన్ ఎస్ఐలు, క్యూ ఆర్ టీ సిబ్బంది మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
