మహబూబ్నగర్, జూన్ 18: మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి ప్రత్యేక పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైం నెం.592/2025 కింద కేసు నమోదు కాగా, లైంగిక దాడికి పాల్పడిన తక్కనపల్లి శివశంకర్ (38), తండ్రి బాల మల్లప్ప, ఎదిర గ్రామానికి చెందిన కూలీపై దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తు అనంతరం పోలీసులు పటిష్టమైన సాక్ష్యాధారాలతో చార్జ్షీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన మహబూబ్నగర్ ప్రత్యేక సెషన్స్ జడ్జి (రేప్ & పోక్సో కేసులు) తమన్ రాజ రాజేశ్వరి మంగళవారం తీర్పు వెల్లడించారు. నిందితుడు నేరం చేసినట్లు రుజువుకావడంతో అతనికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,00,000 జరిమానా విధించారు.
ఈ కేసు దర్యాప్తులో మహబూబ్నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, ఎస్హెచ్ఓ జి. విజయ్ కుమార్, ప్రత్యేక ప్రజా అభియోజకులు ఎం. జాన్ కీలక పాత్ర పోషించారు. అలాగే కోర్టు లైజన్ అధికారులుగా విధులు నిర్వహించిన బాలకృష్ణ (ఏఎస్ఐ), కృష్ణయ్య, శంకర్, రహీమ్ మరియు కేసు డాక్యుమెంటేషన్లో సహకరించిన అశోక్ రెడ్డి సేవలను జిల్లా పోలీసు శాఖ అభినందించింది.
నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతమైన దర్యాప్తు, సాక్ష్యాల సేకరణ, కోర్టులో సమన్వయం మరియు సమర్థవంతమైన వాదనలు వినిపించిన అధికారులందరినీ జిల్లా ఎస్పీ డి. జానకి, అభినందించారు. బాలలపై జరిగే లైంగిక నేరాల విషయంలో జిల్లా పోలీసు శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, ఇలాంటి కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు కొనసాగిస్తామని ఆమె తెలిపారు.
