నల్గొండ, మే 30: నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొని, రిటైర్ అవుతున్న ఎస్ఐ ఖలీలుద్దిన్ ఖాన్, ఏఎస్ఐలు మట్టయ్య, రమేష్, యాదగిరి, శేఖర్ రెడ్డిలను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు క్రమశిక్షణ, అంకితభావంతో సేవలు అందించిన అధికారుల కృషి సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతో దోహదపడిందని అన్నారు. ప్రజల రక్షణ కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ, పగలు రాత్రి తేడా లేకుండా విధులు నిర్వహించి పూర్తి ఆరోగ్యంతో పదవీ విరమణ పొందడం గొప్ప విషయమని కొనియాడారు.
పోలీసు ఉద్యోగం కేవలం విధి మాత్రమే కాకుండా ప్రజాసేవతో కూడిన బాధ్యత అని పేర్కొన్న ఎస్పీ, రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికి మాత్రమేనని, పోలీసు కుటుంబంతో అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని తెలిపారు. ఎలాంటి అవసరం వచ్చినా జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రిటైర్ అవుతున్న అధికారులు తమ సేవా కాలంలో ప్రదర్శించిన నిబద్ధత, నిజాయితీ యువ పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, ఏఓ శివ ప్రసాద్, ఎస్బీ సీఐ ఆది రెడ్డి, ఆర్ఐ సంతోష్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, పోలీసు సిబ్బంది, రిటైర్ అవుతున్న అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
