మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా భారీ నాకాబందీ, ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్లో గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడం, రౌడీ షీటర్లు మరియు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టడం ప్రధాన లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపట్టారు.
జిల్లాలోని ప్రధాన రహదారులు, జాతీయ రహదారులు, సరిహద్దు ప్రాంతాలు మరియు ప్రత్యేక చెక్పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించారు. మహబూబాబాద్ మరియు తొర్రూరు సబ్-డివిజన్ల పరిధిలో మొత్తం 3485 వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు.
మహబూబాబాద్ సబ్-డివిజన్ పరిధిలో డీఎస్పీ, 4 మంది సీఐలు, 18 మంది ఎస్సైలు, 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొని 1985 వాహనాలను తనిఖీ చేశారు. నంబర్ ప్లేట్లు లేని 74 వాహనాలను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
తొర్రూరు సబ్-డివిజన్ పరిధిలో జరిగిన ప్రత్యేక నాకాబందీలో డీఎస్పీ, 4 మంది సీఐలు, 12 మంది ఎస్సైలు, 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొని 1500 వాహనాలను తనిఖీ చేశారు.
ఈ తనిఖీల సందర్భంగా నెల్లికుదురు ప్రాంతంలో ఒక కారులో సుమారు 2.5 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని, గంజాయి తరలింపుకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ డా. శబరీష్ మహబూబాబాద్ పట్టణంలోని మూడు కోట్ల సెంటర్, ధరణి హాస్పిటల్ సమీపంలోని నాకాబందీ పాయింట్లను స్వయంగా పరిశీలించి, విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
ప్రజలకు సూచనలు
గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
అత్యవసర నంబర్లు
- జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్: 8712656999
- అత్యవసర సహాయం: డయల్ 100
