జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని మే 1 నుంచి 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉన్నట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఈ చట్టం ప్రకారం పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో సిరిసిల్ల పట్టణ కేంద్రంలో పోలీసుల అనుమతి లేకుండా ధర్నా నిర్వహించి ప్రజా రవాణాకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన రెండు వర్గాలపై సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైం నంబర్లు 270/2026, 271/2026 కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేసి జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి పోస్టులకు సంబంధించి గ్రూప్ అడ్మిన్లను కూడా బాధ్యులుగా పరిగణిస్తామని తెలిపారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ నాగేంద్రచారి కోరారు.
