సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: రహదారులపై ధాన్యం ఆరబోయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కొంతమంది రైతులు, వ్యాపారులు రహదారులపై ధాన్యం ఆరబోస్తుండటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.
ముఖ్యంగా రాత్రి సమయంలో రోడ్లపై ఆరబోసిన ధాన్యం సరిగా కనిపించక వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. రహదారులపై ధాన్యం ఆరబోయడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు.
ఈ నేపథ్యంలో రహదారులపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు తమ ధాన్యాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన నిర్దిష్ట కల్లాల్లో లేదా వ్యవసాయ శాఖ సూచించిన ప్రదేశాల్లోనే ఆరబోసుకోవాలని సూచించారు.
ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
