రూ.10 వేల జరిమానా విధించిన పోక్సో ప్రత్యేక కోర్టు
హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి గౌరవ పోక్సో ప్రత్యేక కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది.
హైదరాబాద్ హాకా భవన్లోని పోక్సో కేసుల ప్రత్యేక సెషన్స్ న్యాయమూర్తి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 443/2019 కేసులో నిందితుడైన మహమ్మద్ మోహసిన్ (45)పై నేరం రుజువైనట్లు నిర్ధారిస్తూ ఈ తీర్పు వెలువరించారు. నిందితుడిపై IPC సెక్షన్లు 376(2)(f), 376(AB), POCSO చట్టంలోని సెక్షన్ 6 r/w 5(m)(n) కింద కేసు నమోదైంది.
బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
2019 మే 22న సాయంత్రం సుమారు 5:30 గంటలకు 12 ఏళ్ల బాలిక తల్లి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇల్లు చిన్నదిగా ఉండటంతో పిల్లలు నిందితుడి ఇంట్లో నిద్రించేవారని ఆమె తెలిపారు.
మే 15న బాలిక వాంతులు చేసుకోవడంతో క్లినిక్కు తీసుకెళ్లగా, మరుసటి రోజు కడుపునొప్పి రావడంతో మరోసారి చికిత్స చేయించినట్లు తల్లి పేర్కొన్నారు. మే 18న బాలికకు స్నానం చేయిస్తుండగా దుస్తులపై అనుమానాస్పద మరకలు కనిపించడంతో తల్లి ప్రశ్నించగా, మే 13న ఉదయం నిందితుడి ఇంటిని శుభ్రం చేస్తున్న సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక వెల్లడించింది. విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు బెదిరించినట్లు కూడా బాలిక తెలిపింది. అంతకుముందు కూడా రెండుసార్లు నిందితుడు తనను అనుచితంగా తాకినట్లు ఆమె వెల్లడించింది.
దీంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, బాలిక స్టేట్మెంట్ను నమోదు చేయడంతో పాటు ఆమెను భరోసా కేంద్రానికి తరలించారు.
భరోసా కేంద్రం ద్వారా బాధితురాలికి అండ
భరోసా బృందం బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు వివిధ కౌన్సెలింగ్ పద్ధతుల ద్వారా మానసిక, నైతిక సహాయాన్ని అందించింది. నిరంతర ఫాలోఅప్ సెషన్లు, వర్క్షాప్ల ద్వారా కుటుంబానికి అవసరమైన మద్దతు అందించారు.
కోర్టు తీర్పుపై బాధితురాలి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
సమన్వయంతో పనిచేసిన అధికారులు
కేసు దర్యాప్తు, విచారణలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు, ఆర్. కాళింగరావు, స్పెషల్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ. రమాదేవి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. ప్రతాప్రెడ్డి, లీగల్ కౌన్సెలర్లు టి. కల్పన, ఎ.ఆర్. హిమా మీనన్, భరోసా బృందం, పీసీ ఎం. నాగరాజు (PC 5683), సమ్మన్స్ డ్యూటీ ఎస్. వెంకట్రెడ్డి తదితరులు సమన్వయంతో పనిచేశారు.
హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ డీసీపీ డాక్టర్ లావణ్య ఎన్జెపి, ఏసీపీ ప్రసన్న లక్ష్మి, భరోసా ఇన్స్పెక్టర్ పి. పద్మ కేసు పురోగతిని పర్యవేక్షించారు.
నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులు, భరోసా కేంద్ర సిబ్బంది, ప్రాసిక్యూషన్ బృందం మరియు ఇతర భాగస్వాములను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ అభినందించారు.
జారీ చేసిన వారు: డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఉమెన్ సేఫ్టీ, హైదరాబాద్ సిటీ.
