ప్రతి మొబైల్ లావాదేవీకి ముందు CEIRలో IMEI వివరాలు తనిఖీ చేయాలి: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి
సంగారెడ్డి: చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సరైన ధృవీకరణ లేకుండా కొనుగోలు చేయడం, విక్రయించడం, మార్పిడి చేయడం లేదా మరమ్మతులు చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్ హెచ్చరించారు. జిల్లాలోని మొబైల్ డీలర్లు, రిటైలర్లు, సెకండ్హ్యాండ్ మొబైల్ షాపులు, రిపేర్ సెంటర్లు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ప్రతి మొబైల్ ఫోన్ లావాదేవీకి ముందు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్లో ఫోన్కు సంబంధించిన ఐఎంఈఐ నంబర్ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని అదనపు ఎస్పీ సూచించారు. చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బ్లాక్ చేయడంలో CEIR వ్యవస్థ కీలకంగా పనిచేస్తుందని తెలిపారు.
సెకండ్హ్యాండ్ మొబైల్ ఫోన్ను కొనుగోలు చేయడం, విక్రయించడం, మార్పిడి చేయడం లేదా రిపేర్కు తీసుకునే ముందు దాని ఐఎంఈఐ వివరాలను తనిఖీ చేయడంతో పాటు, తమ వద్దకు వచ్చే ప్రతి మొబైల్ ఫోన్కు సంబంధించిన ఐఎంఈఐ నంబర్ను నమోదు చేసి భద్రపరచాలని వ్యాపారులకు సూచించారు.
మొబైల్ ఫోన్ను విక్రయించే వ్యక్తి పేరు, చిరునామా, మొబైల్ నంబర్తో పాటు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ లేదా పాస్పోర్ట్ వంటి ఫొటో గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని తెలిపారు. అదేవిధంగా విక్రేతకు సంబంధించిన లైవ్ ఫొటోను కూడా భద్రపరచాలని సూచించారు.
మొబైల్ ఫోన్ కొనుగోలు, విక్రయాలు, మార్పిడి, మరమ్మతులకు సంబంధించిన అన్ని లావాదేవీలకు ఇన్వాయిస్లు, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు, రిజిస్టర్లను భౌతికంగా లేదా డిజిటల్ రూపంలో నిర్వహించాలని స్పష్టం చేశారు. బ్లాక్ లేదా బ్లాక్లిస్ట్ అయిన ఐఎంఈఐ ఉన్న మొబైల్ ఫోన్లు, సరైన యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు లేని ఫోన్లు లేదా చోరీకి గురైనట్లు అనుమానం ఉన్న మొబైల్ ఫోన్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ లావాదేవీలు చేయరాదని హెచ్చరించారు.
అనుమానాస్పదంగా ఉన్న లేదా చోరీకి గురైనట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్ తమ వద్దకు వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ సెల్కు సమాచారం అందించాలని అదనపు ఎస్పీ సూచించారు. పోలీసుల తనిఖీలు, దర్యాప్తు సమయంలో నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
చోరీకి గురైన వస్తువులను తెలిసీ కొనుగోలు చేయడం లేదా తమ వద్ద ఉంచుకోవడం భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)–2023లోని సెక్షన్ 317 కింద నేరమని పోలీసులు తెలిపారు. సెక్షన్ 317(2) ప్రకారం చోరీ సొత్తు అని తెలిసి స్వీకరించినా లేదా తమ వద్ద ఉంచుకున్నా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అదేవిధంగా చోరీకి గురైన కమ్యూనికేషన్ పరికరం చోరీ సొత్తు అని తెలిసి లేదా తెలిసే కారణం ఉన్నప్పటికీ నిజాయితీ లేకుండా స్వీకరించడం లేదా తమ వద్ద ఉంచుకోవడం సమాచార సాంకేతిక చట్టం–2000లోని సెక్షన్ 66బీ కింద నేరమని తెలిపారు. ఈ నేరానికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ.1 లక్ష వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని వివరించారు.
చోరీకి గురైన మొబైల్ ఫోన్ల చలామణిని అరికట్టడంలో మొబైల్ వ్యాపారులు పోలీసు శాఖకు సహకరించాలని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి కోరారు. ప్రతి ఫోన్ కొనుగోలు, విక్రయం లేదా రిపేర్ సమయంలో యాజమాన్య వివరాలు, ఐఎంఈఐ నంబర్, గుర్తింపు పత్రాలను సక్రమంగా పరిశీలించడం ద్వారా చోరీ మొబైళ్ల అక్రమ మార్కెట్ను అరికట్టవచ్చని తెలిపారు.
జిల్లాలో మొబైల్ ఫోన్ వ్యాపారులు నిబంధనలను కచ్చితంగా పాటించాలని, చట్టవిరుద్ధమైన లావాదేవీలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. ચోరీ లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించడం ద్వారా బాధితులకు ఫోన్ తిరిగి లభించడంతో పాటు నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు.
