పోలీసుల సూచనలు, హెచ్చరికలు తప్పనిసరిగా పాటించాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
తంగళ్లపల్లి: మండలంలోని గోపాలరావుపల్లి గ్రామ శివారులో ఉన్న మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సోమవారం పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పర్యాటకుల భద్రత కోసం అక్కడ చేపడుతున్న భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు.
పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. బ్యాక్ వాటర్ పరిసరాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ పర్యాటకుల భద్రతకు భరోసా కల్పించాలని సూచించారు.
అలాగే బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా చిన్నారులతో, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. నీటి ప్రాంతాలకు దూరంగా ఉండటంతో పాటు ప్రమాదకర ప్రదేశాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. సరదా కోసం వచ్చే పర్యాటకుల విహారం విషాదంగా మారకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
ఈ పర్యటనలో డీఎస్పీ నాగేంద్రచారి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
