హైదరాబాద్లో మే 10న నిర్వహించనున్న ప్రధానమంత్రి Narendra Modi భారీ బహిరంగ సభకు నగర యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సభ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై నగర పోలీస్ కమిషనర్ సుమతి కీలక వివరాలను వెల్లడించారు. సభను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు సుమారు 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భద్రతా కారణాల దృష్ట్యా సభా ప్రాంగణంలోకి డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులను తీసుకురావడంపై నిషేధం విధించినట్లు సీపీ స్పష్టం చేశారు. సభకు హాజరయ్యే ప్రజలు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
బహిరంగ సభ నేపథ్యంలో మే 10 మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
రోడ్లపై ఎక్కడైనా వాహనాలను పార్క్ చేస్తే వాటిని వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. సభకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేకంగా 12 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. వాహనదారులు పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నగర పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
