డీ-అడిక్షన్ సెంటర్ బాధితుల కోసం క్యారం, చెస్ బోర్డులు అందజేత
వ్యసనం నుంచి బయటపడేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి – బాధితులకు పూర్తి సహకారం అందిస్తాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే, వ్యసనానికి గురైన బాధితులను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ సుమన్ రావుకు డీ-అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాధితుల వినియోగార్థం క్యారం, చెస్ బోర్డులను జిల్లా ఎస్పీ అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డీ-అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సేవలతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. బాధితులు త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
గంజాయి వ్యసనానికి బానిసై, ఆ అలవాటు నుంచి బయటపడాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారు పోలీసు శాఖను సంప్రదించాలని ఎస్పీ కోరారు. అలాంటి వారికి అవసరమైన కౌన్సెలింగ్ నిర్వహించి, డీ-అడిక్షన్ సెంటర్కు తరలించి, నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తామని చెప్పారు. వ్యసనం నుంచి బయటపడిన వారు తిరిగి సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా పోలీసు శాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు ఉక్కుపాదం మోపడంతో పాటు, వాటి వినియోగదారులపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి అవగాహన కల్పించడం, అవసరమైతే డీ-అడిక్షన్ సెంటర్కు తరలించి చికిత్స అందించడం వంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు.
గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం లేదా గంజాయి వ్యసనానికి బానిసై స్వయంగా మానలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తుల వివరాలు తెలిసిన వెంటనే సమీప పోలీసు అధికారులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ అడ్మిన్ సురేష్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
