ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను నివారించడం, యువతలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించడంతో పాటు సురక్షిత ప్రయాణంపై చైతన్యం కల్పించే లక్ష్యంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఇబ్రహీంబాగ్లోని వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో విద్యార్థులకు రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్), ఇతర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్పెక్టర్ నాగుల అశోక్, సిబ్బంది విద్యార్థులకు వివిధ రహదారి భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ డీసీపీ (ట్రాఫిక్) సి. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వాహనం నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్ మాత్రమే కాకుండా రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి అప్రమత్తంగా వాహనం నడపడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని ఆయన వివరించారు. ఈ విధానాన్నే డిఫెన్సివ్ డ్రైవింగ్గా పేర్కొంటారని, రోడ్డుపై ఇతర వాహనదారుల తప్పిదాలను కూడా ముందుగానే ఊహిస్తూ జాగ్రత్తగా ప్రయాణించడం ద్వారా ప్రమాదాల తీవ్రతను తగ్గించవచ్చని విద్యార్థులకు వివరించారు.
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అందించే వైద్య సహాయం బాధితుడి ప్రాణాలను కాపాడటంలో అత్యంత కీలకమని తెలిపారు. ప్రమాదం జరిగిన తొలి 60 నిమిషాలను ‘గోల్డెన్ అవర్’గా పరిగణిస్తారని, ఈ సమయంలో బాధితుడిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలను కాపాడే అవకాశం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించే వారికి ప్రభుత్వం అందిస్తున్న ‘రాహ్-వీర్’ పథకం గురించి కూడా విద్యార్థులకు వివరించారు. ప్రమాదంలో గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడేందుకు సహకరించే వ్యక్తులకు ఈ పథకం కింద రూ.25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని సూచించారు.
అనంతరం బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్పెక్టర్ నాగుల అశోక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత వాహనాలు నడిపే సమయంలో నిబంధనలను ఉల్లంఘించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో ఒకటని, వేగాన్ని నియంత్రించుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించడం, వాహనాల మధ్య తగినంత సురక్షిత దూరం నిర్వహించడం, మలుపులు తిరిగేటప్పుడు ఇండికేటర్లను ఉపయోగించడం, రహదారి సంకేతాలను గమనించడం వంటి ప్రాథమిక భద్రతా నియమాలను వివరించారు.
అదేవిధంగా వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి మంచి కండిషన్లో ఉంచుకోవాలని, బ్రేకులు, టైర్లు, లైట్లు తదితర ముఖ్యమైన భాగాల పనితీరును నిర్ధారించుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం వంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.వి. రమణ, హెచ్అండ్ఎస్ఎస్ విభాగాధిపతి డాక్టర్ జి. మీనా, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది కృష్ణతో పాటు సుమారు 800 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
యువతలో రహదారి భద్రతపై అవగాహన పెంచడం ద్వారా ప్రమాదాల సంఖ్యను తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను బాధ్యతగా పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవడమే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
జారీ చేసిన వారు: ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (TTI), బేగంపేట, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్.
