బక్రీద్ పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో డీఎస్పీ కె. శివరాం రెడ్డి స్థానిక కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు, పండుగ నిర్వాహకులు మరియు బీఫ్ షాపుల యజమానులతో పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలు, పరిశుభ్రత మరియు సామాజిక సామరస్యాన్ని కాపాడే దిశగా పలు కీలక సూచనలు చేశారు.
సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన చట్టపరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. నిషేధిత జంతువులను ఎట్టి పరిస్థితుల్లోనూ వధించరాదని, జంతువుల రవాణా సమయంలో వెటర్నరీ డాక్టర్ ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే బహిరంగ ప్రదేశాలు, రోడ్ల పక్కన జంతువుల వధ పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. బీఫ్ షాపుల యజమానులు తమ వ్యాపార ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరదాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జంతు వ్యర్థాలను రోడ్లపై లేదా మురుగు కాలువల్లో వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
వ్యర్థాలను మందపాటి ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి, మున్సిపల్ అధికారులు కేటాయించిన వాహనాల్లో లేదా నిర్ణీత ప్రాంతాల్లో మాత్రమే వేయాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణం కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎస్పీ పిలుపునిచ్చారు.
సోషల్ మీడియా వినియోగంపై కూడా ఆయన అప్రమత్తం చేశారు. కుర్బానీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదని సూచించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు లేదా సందేశాలు పంపించే వారిపై ఐటీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వాహనాలను అడ్డుకోవడం, గొడవలకు దిగడం వంటి చర్యలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనుమానాస్పద సంఘటనలు గమనించినా వెంటనే డయల్-100కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా డీఎస్పీ కె. శివరాం రెడ్డి మాట్లాడుతూ, “బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక. ఈ పండుగను అందరూ సోదరభావంతో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలి. ప్రజలు, వ్యాపారులు, మత పెద్దలు పోలీసు శాఖకు మరియు మున్సిపల్ అధికారులకు సహకరించి పట్టణంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలి” అని పిలుపునిచ్చారు.
